78
ఆసాపు ధ్యాన గీతం. 
 
1 నా ప్రజలారా నా ఉపదేశాలను వినండి.  
నేను చెప్పే విషయాలు వినండి.   
2 ఈ కథ మీతో చెబతాను.  
ఈ పురాతన కథ నేను మీతో చెబతాను.   
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.  
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.   
4 ఈ కథను మనము మరచిపోము.  
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబతారు.  
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.  
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబదాము.   
5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.  
దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మ శాస్త్రాన్ని ఇచ్చాడు.  
మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.  
మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.   
6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మ శాస్త్రాన్ని తెలుసుకొంటారు.  
కొత్త తరాలు పుడుతాయి వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబతారు.   
7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.  
దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.  
వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.   
8 ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే,  
అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు.  
వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు.  
ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.   
   
 
9 ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు కలిగి ఉన్నారు.  
కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు.   
10 వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపు కోలేదు.  
దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు.   
11 ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు.  
ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు.   
12 ఈజిప్టులోను, సోయను వద్దను  
దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.   
13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు.  
వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.   
14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.  
ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.   
15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు.  
భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.   
16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు.  
అది ఒక నదిలా ఉంది.   
17 కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు.  
అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు.   
18 అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు.  
కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు.   
19 వారు దేవునికి విరోధంగా మాట్లాడారు.  
“ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా?   
20 దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది.  
తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు.   
21 ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు.  
యాకోబు మీద దేవునికి చాలా కోపం వచ్చింది.  
ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది.   
22 ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు.  
దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు.   
23-24 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు.  
వారికి ఆహారంగా ఆయన మన్నా కురిపించాడు.  
అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు  
ఆకాశంలోని ధాన్యా గారం నుండి ధాన్యం పోసినట్టు ఉంది.   
25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.  
ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.   
26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు.  
వర్షం కురిసినట్లుగా పూరేళ్లు వారిమీద వచ్చి పడ్డాయి.  
దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది.  
ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.   
28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో  
ఆ పక్షులు వచ్చి పడ్డాయి.   
29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.  
కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.   
30 వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు.  
అందు చేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు ఆ పూరేళ్లను తినివేసారు.   
31 ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు.  
ఆరోగ్యవంతులైన అనేకమంది పడుచువాళ్లు చచ్చేటట్టుగా దేవుడు చేశాడు.   
32 కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు.  
దేవుడు చేయగల ఆశ్చర్యకరమైన విషయాల మీద వారు ఆధారపడలేదు.   
33 కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను  
ఏదో విపత్తుతో అంతం చేశాడు.   
34 దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలిన వారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు.  
వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు.   
35 దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు.  
సర్వోన్నతుడైన దేవుడే తమని రక్షించాడని వారు జ్ఞాపకం చేసుకొంటారు.   
36 వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు,  
కాని వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చేప్పారు.   
37 వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు.  
వారు ఒడంబడికకు నమ్మకంగా లేరు.   
38 కాని దేవుడు దయకలిగినవాడు.  
వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు.  
అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు.  
దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు.   
39 వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు.  
మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు.   
40 అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు.  
ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.   
41 ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు.  
ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు.   
42 ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు.  
శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు.   
43 ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు.  
సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు.   
44 నదులను దేవుడు రక్తంగా మార్చాడు!  
ఈజిప్టు వారు నీళ్లు తాగలేకపోయారు.   
45 ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు.  
ఈజిప్టు వారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు.   
46 దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు.  
వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు.   
47 ఈజిప్టు వారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు.  
వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడు కొన్నాడు.   
48 దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను  
వారి పశుపులను పిడుగుల చేతను చంపేశాడు.   
49 దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు.  
నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు.   
50 దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు.  
ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు.  
వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.   
51 ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు.  
హాము సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు.   
52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.  
ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.   
53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.  
దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు.  
వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.   
54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.  
తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.   
55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.  
దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు.  
అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.   
56 కానీ ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.  
ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.   
57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లు కొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మ కస్తులుగాను ఉన్నారు.  
వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.   
58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.  
దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.   
59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.  
మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.   
60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.  
ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.   
61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాల ద్వారా తన ప్రజలను బందీలుగా చేయనిచ్చాడు.  
దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.   
62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.  
ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.   
63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.  
పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.   
64 యాజకులు చంపివేయబడ్డారు.  
కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.   
65 తాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,  
నిద్రనుండి మేల్కోన్న మనిషివలె ప్రభువు లేచాడు.   
66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.  
దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.   
67 కానీ యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.  
ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.   
68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.  
మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.   
69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.  
భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.   
70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.  
దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.   
71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,  
తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.   
72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.  
అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.